కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు..
కాలం చెల్లిన ఎక్సైజ్ ప్రభుత్వ కార్యాలయం భవనం పైకప్పు అకస్మాత్తుగా కొంత భాగం కూలడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోనీ ఫరూక్ నగర్ లో ఉన్న ఎక్సైజ్ శాఖ కార్యాలయం పైకప్పు కొంత భాగం కూలింది. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విజయకుమార్ పై పడడంతో తీవ్ర రక్త గాయాలు అయ్యాయి. వెంటనే మిగతా సిబ్బంది గాయపడిన విజయ్ కుమార్ ను ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అతని పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నట్లు పేర్కొన్నారు.
ఎప్పుడో కాలం చెల్లిన ఎక్సైజ్ శాఖ భవనం పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. భవనం నిర్మించి చాలా సంవత్సరాలు అయిందని స్థానికులు చెబుతున్నారు. కాలం చెల్లిన భవనం కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ సంఘటనతో స్థానికులు ఒకసారిగా ఖంగుతున్నారు.