సివిల్ ర్యాంకర్ సాయిశివాణిని సన్మానించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
సివిల్స్ ర్యాంకర్ సాయి శివాణిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు. సివిల్స్లో ప్రతిభ కనబరిచి 11వ ర్యాంకు సాధించిన వరంగల్కు చెందిన ఇట్టబోయిన సాయి శివాణిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. తన తల్లిదండ్రులు రాజు, రజితతో కలిసి సాయి శివాణిని ఆయన సత్కరించారు.
సివిల్స్ ర్యాంకర్ సాయి శివాని మేనమామ ప్రకాశ్ రావు ఆర్టీసీలో డీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని బస్ భవన్లో ఆమె తన కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ను కలిశారు. సాధారణ కుటుంబానికి చెందిన సాయిశివాని.. సివిల్స్లో చిన్న వయసులోనే అత్యుత్తమ ర్యాంకు సాధించి యువతకు స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా, సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా అనుకున్న లక్ష్యాన్ని ఆమె సాధించారని ప్రశంసించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉన్నతంగా రాణించాలని ఆమెకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, సిరిసిల్ల డీఎం ప్రకాశ్ రావు, తదితరులు పాల్గొన్నారు.