ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన..
పటాన్ చెరువు: మండలం చిన్న కంజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొంత స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ సొంతింటిని నిర్మించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 3500 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి, పూర్తి పారదర్శకతతో, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం చేయకుండా ఇళ్లను నిర్మించుకోవాలని లబ్ధిదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ఇళ్ల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని హెచ్చరించారు.
మొదటి విడతలో 2047 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయని, ఇళ్ల నిర్మాణ దశకు అనుగుణంగా నిధులు విడుదల అవుతాయని ఆయన తెలియజేశారు. చిన్న కంజర్ల గ్రామంలోనే 65 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరైనట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రంగారావు, ఎంపీడీవో యాదగిరి, గృహ నిర్మాణ శాఖ డిఈ రవీందర్, గ్రామీణ నీటిపారుల శాఖ డిఈ శ్రీనివాస్, గ్రామ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.