ఏందీ మామా ఈ పంచాయతీ..?
- ఫామ్ హౌస్ లో కేసిఆర్ తో హరీష్ రావు భేటి
- కవిత పంచాయతీపై సమాలోచనలు
- సస్పెండ్ చేస్తే నా స్టాండ్ నాకు ఉంది అంటున్న కవిత
- బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అంటే తాను తప్పు చేసినట్లు ఒప్పుకోవడమే.. కవిత
- అంతర్గత కుమ్ములాటలో అయోమయంలో నేతలు
బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలు సీనియర్ నేతలను కలవరానికి గురిచేస్తున్నాయి. కవిత పార్టీ పెడితే ఎందులో ఉండాలా అనే ఆలోచనలు నేతల్లో రేకెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు కవితతో కలుస్తున్నారని సమాచారం. అయితే ఎవరెవరు కలుస్తున్నారో వాటిపై బిఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తోంది. ఇటీవల కవిత తెగేసి చెప్పిన మాటలపై కేసీఆర్ తో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో హరీష్ రావు భేటి అయ్యాడు. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నుండి జనం మరోసారి బిఆర్ఎస్ వైపు మల్లుతున్న సమయంలో పార్టీలో గొడవలు చెలరేగితే మొదటికే మోసం వస్తుందని, గొడవలు సద్దుమణగాలి అంటే కేసిఆర్ నేరుగా రంగంలోకి దిగాలంటూ హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ ముక్కలైతే వచ్చే నష్టంపై ఎవరి ఆలోచనలు వారు తెలుపుతున్నారు.
అయితే కవితకు నోటీసులు ఇచ్చి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరగడంతో దీనిపై కూడా కవిత ఘాటుగానే స్పందించారు. బిఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం అంటే తను లిక్కర్ కేసులో తప్పు చేసినట్లు అంగీకరించినట్లే అని తెలిపారు. పార్టీ సస్పెండ్ చేస్తే తనకంటూ ఓ స్టాండ్ ఉందన్నారు. కేసిఆర్ చుట్టూ తిరిగే దయ్యాలే తన లేఖను బయటపెట్టాయని ఈ విషయం అందరికి తెలుసన్నారు. తన తండ్రిని నేరుగా కలిసే వీలున్నా కూతురిగా కూడా కలవలేకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ vs కవిత వ్యవహారం రోజు రోజుకు ముదిరిపోవడంతో చక్కదిద్దేందుకు హరీష్ రావు రంగంలోకి దిగాడని పలువురు సీనియర్ నేతలు అంటున్నారు. కవిత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని, ఇప్పటికే ప్రజల్లో ఈ తికమక నెలకొనడంతో కాంగ్రెస్ పార్టీ వారిని తమవైపు తిప్పుకొనేందుకు సోషల్ మీడియా వేదికగా అనేక తప్పడు ప్రచారాలు చేస్తోందని, అందుకే దానికి అడ్డుకట్ట వేసి ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకే సమావేశం అయినట్లు చెబుతున్నారు. ఇక హరీష్ రావు సన్నిహితులు మాత్రం కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపద్యంలో విచారణ సమయం దగ్గర పడుతుండటంతో దానిపై చర్చలు అని, కవిత వ్యవహారంపై కేసీఆర్ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు అంటూ సమాధానం ఇస్తున్నారు. ఏదిఏమైనా ఫామ్ హౌస్ లో మామఅల్లుళ్ల భేటీపై పార్టీలో ఉత్కంఠ నెలకొంది.