ఫిష్ మెడిసిన్ కి... డేట్ ఫిక్స్ అయ్యింది..
మృగశిర కార్తెకి సమయం దగ్గర పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న ఆస్తమా వ్యాధి గ్రస్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడింది. ప్రతి ఏడాది తరహాలోనే ఈ సారి కూడా చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు పెద్దఎత్తున కసరత్తు మొదలైంది. బత్తిని కుటుంబ సభ్యులు తరతరాలుగా తమ ఆచార వ్యవహారంలో భాగంగా మార్చుకున్న ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు అందరూ నిమగ్నమయ్యారు. లక్షలాదిగా వచ్చే జనాలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 8 మరియు 9 తేదీలలో నిర్వహించనున్న నేపథ్యంలో, ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ సమావేశం హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శిల్పవల్లీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. హైదరాబాద్ నగరానికి చెందిన మొత్తం 21 శాఖల ప్రతినిధులు, నిర్వాహక సంస్థ, స్వచ్ఛంద సంస్థలు (NGOs), మరియు ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి శాఖలవారీగా చర్చలు జరిపారు. గత సంవత్సరం జరిగిన లోపాలను సమీక్షించి, వాటిని ఈ సంవత్సరం సరిచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, బందోబస్తు మరియు ఫిష్ ప్రసాదం పంపిణీ విజయవంతంగా పూర్తవలసిందిగా ఆదేశించబడ్డాయి. వచ్చే జనాలకు రవాణా, బస, భోజన వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, స్వచ్ఛంద సంస్థల సేవా కార్యక్రమాలపై సమావేశంలో చర్చించుకున్నారు. వీఐపీల రాకపోకలు ఉన్న, సాధారణ జనాలకు ఇబ్బంది కలగకుండా ఈ సారి మెడిసిన్ స్టాల్స్ ఎక్కువ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మందు కోసం వచ్చే వారిని మోసం చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తారని అలాంటి వారిపై నిఘా పెంచాలని సిబ్బందికి డీసీపీ ఆదేశాలు జారీ చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. వీలైతే బత్తిని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎగ్జిబిషన్ మైదానంతో పాటు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తే రద్దీ తగ్గే అవకాశాలు వుంటాయని భావించారు.