బుజ్జమ్మను.. బుజ్జగించే పనిలో పడ్డ బాపు...
బుజ్జమ్మను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం.. ప్రత్యేక పార్టీ పెడితే పోయేది మీ బాపు పరువే అంటూ నచ్చ చెప్పే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. ఒకపక్కన కాళేశ్వరం, మరోపక్కన ఈ ఫార్ములా కేస్ ఇలా కాంగ్రెస్ సర్కార్ ఇరకాటంలో పడేయాలని చూడటం, బిఆర్ఎస్ లో ఇంటిపోరు అంటూ ప్రతిపక్షాలు చేసే విమర్శలు ఇలాంటి సందర్భంలో అండగా ఉండాల్సింది పోయి ప్రత్యేక కుంపటి పెడితే సెగ తగిలేది మనకే అంటూ సీనియర్ నేతలు ఆమెను వేడుకుంటున్నారు. తెలంగాణ నినాదంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లి మన బలం చూపించు కోవాల్సిన సమయం వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ హామీల సునామీ తెలిసి జనం ఛీకొట్టి బిఆర్ఎస్ కి దగ్గరై కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకునే తరుణంలో ఇలాంటి నిర్ణయాలు మనకే నష్టం అంటూ చెప్పుకొస్తున్నారు.
బ్యాక్ సపోర్ట్ మాటలు వింటే బోర్లా పడి మిగిలేది గాయాలే అని, కాంగ్రెస్ ప్రభుత్వం వేసే ఎత్తులను చిత్తు చేయాలి అంటే కలిసికట్టుగానే సాధ్యం అవుతుందని తెలిపారు. వీటిపై అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నారు. ఇందుకు గాను కవితతో బీఆర్ఎస్ ఎంపీ దామోదర్రావు, లీగల్ సెల్ ఇంఛార్జ్ గండ్ర మోహన్రావు మూడు గంటల పాటు భేటి అయ్యారు. కేసీఆర్ ఆదేశాలతో కవితతో సమావేశమైనట్లు ఆమెకు వివరించారు.
ఇక షోకాస్ నోటీసులు సర్వసాధారణం అని వాటిని అంతగా పట్టించుకోవాల్సిన పని లేదని, లేఖను బహిర్గతం చేసిన ఇంటిదొంగలను గుర్తించేందుకు కలిసికట్టుగా ముందుకు వెళదామని కోరినట్లు సమాచారం. మూడు గంటల పాటు ఓపిగ్గా విన్న కవిత తన నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని కోరినట్లు సమాచారం. ఇంతలో కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై కవిత ఎక్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనితో ఆమె కోపం తగ్గిందని, ప్రత్యేక పార్టీ ఉండదని కొందరు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కుటుంబం వేరు.. కవిత పార్టీ నిర్ణయాలు వేరు అని ఆమె సన్నిహితులు సమాధానం ఇవ్వడంతో ఆశలు ఆడియాసలై ప్లాన్ తలకిందులైందని భావిస్తున్నారు. ఇప్పటికే జెండా. అజెండా.. రూపొందించుకొని జూన్ లో పార్టీ అనౌన్స్ మెంట్ కి సిద్ధం అయిన కవిత సమాధానం ఎలా ఉంటుంది, ఏ నిర్ణయం తీసుకోబోతోంది అనేది బిఆర్ఎస్ లో ఉత్కంఠగా మారింది.