మాగీ మాటలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం

By Ravi
On
మాగీ మాటలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన తీవ్ర ఆరోపణలు దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దేశ ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు, కొందరు సంపన్న పురుష స్పాన్సర్లను అలరించాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని మిల్లా మాగీ ఆరోపించారు. ఈ ఆరోపణలు ఇంగ్లండ్మీడియాలో ప్రచురితమవడంతో వివాదం రాజుకుంది. "మేం పోటీల కోసం వచ్చామో, దేనికోసం వచ్చామో అర్థం కాలేదు. ఇవేం పోటీలు?" అంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. తెలంగాణ ఆతిథ్యం బాగుందని చెబుతూనే, నిర్వాహకుల తీరుపై ఆమె అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె పోటీల నుంచి అర్ధాంతరంగా వైదొలిగి స్వదేశానికి వెళ్లిపోయారు.
ఈ ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్, మరో ఐపీఎస్ అధికారిణి రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీలతో కూడిన త్రిసభ్య కమిటీని విచారణ నిమిత్తం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే తమ దర్యాప్తును ప్రారంభించింది. పోటీల్లో పాల్గొన్న ఇతర యువతులను కూడా విచారించి, వారి వాంగ్మూలాలను నమోదు చేస్తోంది. అవసరమైతే వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. మిల్లా మాగీ ఆరోపణల్లో వాస్తవమెంత? పోటీల సందర్భంగా నిర్వాహకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కావడంతో, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. విచారణలో భాగంగా మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మోర్లీ, రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌ల నుంచి కూడా వివరాలు సేకరించారు. మిల్లా మాగీ హాజరైనట్లు చెబుతున్న విందు కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఆ రోజు ఆమెతో సన్నిహితంగా ఉన్నవారు ఎవరు అనే వివరాలను కూడా కమిటీ సేకరిస్తోంది. పూర్తిస్థాయి విచారణ అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనుంది.

Tags:

Advertisement

Latest News