భూమయ్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి.. సిఐటియు
సంగారెడ్డి జీల్లా పటాన్ చెరువు మండలం రుద్రారం ఎంఎస్ఎన్ పరిశ్రమ గేట్ ముందు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు ఢీకొని మృతి చెందిన భూమయ్య కుటుంబానికి 30 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఐటీయూ నాయకులు, పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఇన్స్ ఫెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మరియు కార్మిక శాఖ అధికారులు వెంటనే ఎంఎస్ఎన్ పరిశ్రమలో తనిఖీలు నిర్వహించి, యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. ఎంఎస్ఎన్ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కార్మిక శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ డిమాండ్లను తెలియజేస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో ఈరోజు కంపెనీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. పరిశ్రమ యాజమాన్యం స్పందించి, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్ రావు, శ్రీనివాస్, వెంకటేష్, శాంతకుమార్, యాదయ్య, గడ్డ మీది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.