తలకోనలో తలదించుకునే పనులు
అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని అడవుల్లో అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. సహజ అందాలకు తలమానికంగా వున్న తలకోన ఫారెస్ట్ ఏరియాలోని నిషేధిత ప్రాంతాల్లో మందుబాబులు విందులతో చిందులేస్తున్నారు. నిజానికి తలకోన ఫారెస్ట్ను సందర్శించాలంటే పక్కాగా అధికారుల అనుమతి తీసుకోవాలి. మద్యం సేవించడం, గుమిగూడడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కానీ ఇటీవల కొంత కాలంలో తలకోనలో మందు పార్టీల సందడి పెరిగింది. సైట్ సీయింగ్తో పాటు పార్టీలు చేసుకోవచ్చంటూ కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియా గ్రూపుల ద్వారా యువతకు గాలం వేస్తున్నారు. ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్తో పాటు మందు పార్టీలకు అనుమతి వుందని ట్రాప్ చేస్తున్నారు. నిజమేనని నమ్మి వస్తున్న యువత సదరు కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తలకోన అటవీ ప్రాంతంలో పోలీసులమని బెదిరిస్తూ యువతను నిలువుదోపిడి చేస్తున్న నకిలీ పోలీసుల వ్యవహారం ఇటీవల సంచలనం రేపింది. పర్యాటకులను బెదిరిస్తూ డబ్బులు దండుకుంటున్న వైనాలు కలకలం రేపాయి. తలకోనను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వల్ల తలకోనలో అసాంఘీక శక్తుల ఆగడాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తలకోనలో మందుపార్టీలపై సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఫారెస్ట్ ఏరియాలోకి ప్రవేశించడమే కాకుండా మందు పార్టీలు చేసుకుంటున్న పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. యువకులతో పాటు వాళ్లలో ఇద్దరు యువతులు వున్నారు. పార్టీ ఆర్గైనైజ్ చేసిన ముగ్గురిని గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనుమతి లేకుండా ఫారెస్ట్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ అధికారి జగన్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తలకోనలో అసాంఘీక శక్తుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.