కంపెనీలో ఆపరేటర్.. బయట గంజాయి వ్యాపారం
మహారాష్ట్ర జౌరంగబాద్లోని ఒక కంపెనీలో ఆపరేటర్గా పని చేస్తున్నాడు. వస్తున్న జీతం సరిపోవడం లేదని గంజాయి వ్యాపారంలోకి దిగాడు. రెండేళ్లుగా ఉద్యోగంతో పాటు గంజాయి వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. 2023లో ఒకసారి గంజాయి రవాణ చేస్తూ అబుల్లాపూరమెట్లో పట్టుబడ్డాడు. ఈ కేసులో జైలుకు కూడ వెళ్లి వచ్చాడు. ఐనా గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న జలీలుద్దీన్ సిద్దిఖిఅహ్మమద్ హుస్సెన్ మరోమారు గంజాయిని తరలిస్తూ ఎస్టిఎఫ్ ఏ టీమ్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడటంతో అసలు విషయం బయటపడింది. సీలేరు నుంచి గంజాయిని తీసుకొని మహారాష్ట్రలోని పలుప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తున్నాడు. లక్ష్మీబాయి అనే మహిళ వద్ద 20.6 కేజీల గంజాయిని తీసుకొని జాతీయ రహదారి 65లో సంగారెడ్డి పోతురెడ్డిపల్లిలోని పల్లవి అపార్ట్మెంట్ ప్రాంతంలో కారులో వెళ్తుండగా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 10 లక్షలు ఉందని తెలిపారు.