గొర్రెల స్కాంలో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ అరెస్ట్
గొర్రెల స్కాం మరోసారి ఊపందుకుంది. ఈ కేసులో పరారీలో ఉన్న కాంట్రాక్టర్ మొహినుద్దీన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ కేసు నమోదు తర్వాత కాంట్రాక్టర్ మొయినుద్దీన్ విదేశాలకు పారిపోయాడు. దుబాయ్ నుండి హైదరాబాద్ తిరిగి వస్తున్నట్లు తెలుసుకున్న ఏసీబీ అధికారులు ఇమిగ్రేషన్ అధికారుల సహకారంతో ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నేరుగా బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. గొర్రెలను కొనుగోలు చేసి వాటి యజమానులకు డబ్బులు ఇవ్వకుండా స్వాహా చేసినట్లు దర్యాప్తు తేలింది.
ఏసీబీ దర్యాప్తులో 700 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని గుర్తించిన అనంతరం ఈ కేసులో పశు సంవర్ధక శాఖ అధికారులతో పాటు మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడుగా మొయినుద్దీన్ వున్నాడు. ఈ స్కాంలో ఈడి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఆ శాఖ నుంచి వివరాలు సేకరించిన ఈడీ అధికారులు ఏసీబీ అరెస్ట్ చేసిన మొయినుద్దీన్ ని విచారించే అవకాశం ఉంది.