పాకిస్తాన్ పై ఆర్థిక దాడులకు ప్లాన్ చేస్తున్న భారత్..
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల, దాని వెనక ఉన్న పాకిస్తాన్పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాదులు, వారి వెనక ఉన్నవారు, మద్దతుదారులను భారత్ విడిచిపెట్టదని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దీంతో, పాకిస్తాన్పై తీవ్ర చర్యలు ఉంటాయని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే, భారత్ పలు కఠిన చర్యల్ని మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో పాటు, పాకిస్థానీలకు వీసాలను రద్దు చేయడం, భారత గగనతలాన్ని పాక్ ఎయిర్లైనర్లకు మూసేసింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఆర్థికపరమైన దాడికి భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు ఆర్థిక దాడులను ప్లాన్ చేస్తోంది. పాకిస్తాన్ని తిరిగి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్పోర్స్ గ్రే లిస్ట్లోకి తీసుకురావడానికి భారతదేశం చురుకుగా ప్రయత్నించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
ఇక రెండోది, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు నిధుల దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ, అంతర్జాతీయ ద్రవ్యనిధి పాకిస్తాన్కి ఇస్తామని ఒప్పుకున్న 7 బిలియన్ డాలర్లను ఇవ్వద్దని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. మూడేళ్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి 202 జూలైలో ఒప్పందం ఫిక్స్ అయ్యింది. నెక్ట్స్ ప్లీనరీ సమావేశాలకు ముందే భారత్ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలని అనుకుంటోంది. భారత్ రాబోయే వారల్లో కీలకమైన సభ్య దేశాలతో చర్చలు జరపనుంది. ఈ క్రమంలోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.