ప్రజలు ఎప్పుడు శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటారు. డీజీపీ జితేందర్..
ప్రజలు ఎల్లప్పుడూ శాంతి భద్రతలతో కూడిన సమాజాన్ని కోరుకుంటారని కామారెడ్డి జిల్లా శాంతి భద్రతల సమీక్షా సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ అన్నారు. రాష్ట్ర డిజిపి డా. జితేందర్ ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జిల్లాల పోలీసు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. తదుపరి కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ముందుగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రాధాన్యమైన కేసులు, మరియు నేరాల పరిశీలన, ప్రజలకు అందించిన సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రజెంటేషన్ లో జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలు జిల్లా పోలీసులు ప్రదర్శించిన ప్రతిభలను ప్రస్తావించారు. డీజీపీ ప్రతి సర్కిల్ ఇన్ స్పెక్టర్ మరియు సబ్ డివిసనల్ అధికారులతో ప్రత్యేకంగా చర్చించి వారి ఏరియాలో జరుగతున్న నేరాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ముఖ్యమైన కేసుల వివరాలు, వాటి పురోగతి నేరాల నివారణకు చేపట్టిన చర్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజలు ఎల్లప్పుడూ శాంతిభద్రతలతో కూడిన సమాజాన్ని కోరుకుంటారని ఆ దిశగా పోలీస్ సిబ్బంది కృషి చేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని డీజీపీ సూచించారు. పోలీసు శాఖ యొక్క ప్రధాన లక్ష్యం ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం అని స్పష్టం చేశారు. ప్రజలలో వారు సురక్షితంగా ఉన్నాము అన్న భావన కలిగేలా పోలీసింగ్ జరగాలని ఆయన సూచించారు. ప్రజల అభిప్రాయాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం ద్వారా వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడమే కాకుండా నేరాలుకూడా తగ్గించవచ్చు అని తెలిపారు. అదే విధముగా ప్రతి కేసులో సమర్తమంతమైన మరియు నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల నమ్మకాన్ని పెంపొందిచవచ్చని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు హైవే అథారిటీ, రవాణా శాఖ వారితో సమన్వయం చేసుకుంటూ ప్రివెంటివ్ చర్యలు, ట్రాపిక్ నియమాల పై మరియు సైబర్ నేరాలపట్ల ప్రజలకు అవగాహాన కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమని కొనియాడారు. ఏదైనా నేరం జరిగాక చర్యలు తీసుకునే కంటే జరుగక ముందే ముందస్తు సమాచారం తో నేరాలను ప్రివెంటివ్ చెయ్యాలని, తరచు ప్రాపర్టీ నేరాలకు పాల్పడే వారే మరలా నేరాలు చేస్తున్నారు కావున వారి పై నిరంతర నిఘా ఉండాలని అన్నారు.
మల్టీ జోన్ _ఐజిపి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఏం. రాజేష్ చంద్ర, అసిస్టెంట్ ఎస్పీ పి.చైతన్య రెడ్డి తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య లు మర్యాదపూర్వకంగా డిజిపిని కలిశారు.