తొలిబడి అమ్మ వడి.. మలి బడి అంగన్వాడి బడి:మంత్రి సీతక్క

By Ravi
On
తొలిబడి అమ్మ వడి.. మలి బడి అంగన్వాడి బడి:మంత్రి సీతక్క

తొలి బడి అమ్మవడి మలి బడి అంగన్వాడీ బడి అని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా మంత్రి పాత కొత్తగూడెం నుండి పెనుబల్లి రోడ్డు 0/600 వద్ద 6.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి పనులకు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని  సాంబశివరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కొత్తగూడెం క్లబ్ నందు ఏర్పాటుచేసిన ఇందిరమ్మ అమృతం పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించి వేస్ట్ నుండి బెస్ట్ గారు రూపొందించిన కళాకృతులను చూసి అభినందించారు.

ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఇందిరమ్మ అమృతం పథకాన్ని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోలిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం  వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్, మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ మరియు ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పేరిట ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్ మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పథకం ద్వారా మూడు జిల్లాల్లో 50 వేల 269 మంది బాలికలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఆడపిల్లలు సరైన పౌష్టికాహారం లేక అనేక రకాల జబ్బులు మరియు పౌష్టికాహార లోపం తలెత్తుతుందన్నారు. వాటిని  14 నుండి 18 సంవత్సరాల లోపు బాలికలకు ఈ ఇందిరమ్మ అమృతం పథకం  ద్వారా మిల్లెట్స్ తో కూడిన చిక్కీలను నెలకు రెండు ప్యాకెట్లు అందించడం జరుగుతుందన్నారు. ఒక్కో ప్యాకెట్లో 15 చిక్కిలు ఉంటాయని రోజుకు ఒక చిక్కి తిండటం ద్వారా ఆడపిల్లలు నెలసరి టైం లో వచ్చే సమస్యలను, రక్తహీనతను తగ్గించి మరియు శక్తిని పెంపొంచే విధంగా ఈ చెక్కిలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఆడపిల్లను ఎదగనిద్దాం, బ్రతకనిద్దాం, గౌరవిద్దాం.. వారిని ప్రోత్సహించి లక్ష్యాలను సాధిద్దాం అని మంత్రి పిలుపునిచ్చారు.

అంగన్వాడీ కేంద్రాలన్నింటిని ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చడం జరిగిందని, పిల్లలందరికీ నర్సరీ పాటలతో  పాటు ఆహారం అందించడం జరుగుతుందన్నారు. ప్రైవేటు  పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రుల కష్టాలు వృధా చేయకుండా అంగన్వాడీ కేంద్రాలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా  అంగన్వాడీ కేంద్రాలలో ఏక రూప దుస్తులను అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు ఆడుకోవడానికి 57 రకాల ఆట వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు. త్వరలోనే గర్భిణీ స్త్రీలు కింద కూర్చోకుండా అన్ని అంగన్వాడి కేంద్రాలలో బల్లలను  ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడి సెంటర్ల నుండి దేశ భవిష్యత్ నిర్మాణం అవుతదని మంత్రి అన్నారు. అంగన్వాడి టీచర్లు పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలను ఆకర్షించే విధంగా బొమ్మలు, పెయింటింగ్ ఇటువంటి వాటి ద్వారా పాఠాలు బోధించాలన్నారు. జిల్లాలో మహిళ, శిశు సంక్షేమ శాఖ వారు తయారుచేసిన వేస్ట్ నుండి బెస్ట్ చాలా ఆకర్షించిందని వాటిని రాష్ట్రవ్యాప్తంగా చూపెడతామన్నారు. మొట్టమొదటిసారిగా అంగన్వాడీ కేంద్రాలకు నెలరోజుల వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది అన్నారు. అంగన్వాడీ టీచర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షల రూపాయలు అందించడానికి ఆమోదం తెలుపుతూ నిన్న సాయంత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  సంతకం చేశారని  తెలిపారు

చిన్న చిరు ఉద్యోగుల కష్టాలు కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు. రాబోయే కాలంలో ఆశ వర్కర్ల జీతాల పెంపు మరియు రెగ్యులైజేషన్ చేస్తామని తెలిపారు. మిషన్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా ప్రభుత్వం నెలకు 4 వేల రూపాయలను అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తల్లితండ్రులు లేని పిల్లలు బాధపడొద్దని ఇంత పెద్ద ప్రభుత్వం మీ వెంట ఉందని మంత్రి అన్నారు.ఈ పథకం కింద జిల్లాకు మంజూరు అయిన 74 లక్షల 64 వేల రూపాయల చెక్కును పిల్లలకు మంత్రి అందజేశారు. అంగన్వాడి టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రెండు లక్షల రూపాయలు ఆమోదానికి కృషిచేసిన మంత్రి సీతక్కను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు మరియు అంగన్వాడీ టీచర్లు సన్మానించారు.

Advertisement

Latest News