పరిగిలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి..
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారిలో నలుగురు మృతి చెందారు. 20మందికి పైగా తీవ్ర గాయపడగా వారిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెళ్ళి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పరిగిలో ఓ విందులో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన నలుగురు మృతదేహాలను అతి కష్టం మీద పోలీసులు స్థానికులు, జేసీబీ సహకారంతో బయటకు తీశారు. రోడ్డు ప్రమాదంతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవేపై ఎలాంటి పార్కింగ్ సిగ్నల్ చూపించకుండా రోడ్డుపై లారీ నిలడం వల్ల జరిగిందా లేక డ్రైవర్ నిద్ర మత్తు వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.