ప్రపంచస్థాయిలో అరుదైన అవార్డ్ కైవసం చేసుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్
అంతర్జాతీయ పోలీస్ సమ్మేళనంలో రికార్డ్ బద్దలు కొట్టిన సిటీ పోలీసులు
ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్ అవార్డ్ అందుకున్న సిపి సి.వి. ఆనంద్
మాదకద్రవ్యాల నిరోధించడంలో నెంబర్ వన్ స్థాయిలో నిలిచిన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ వింగ్ అరుదైన అవార్డ్ కైవసం చేసుకుంది. సి.వి. ఆనంద్, డైరెక్టర్ జనరల్ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్, దుబాయ్ పోలీస్ ఆధ్వర్యంలో మే 13 నుండి మే 16, 2025 వరకు నిర్వహించిన వరల్డ్ పోలీస్ సమిట్ (WPS) 2025 లో "ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కొటిక్స్ అవార్డు" ను తొలి స్థానం లో అందుకున్నారు. హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకున్న ప్రొయాక్టివ్ చర్యలు, విద్యార్థులు మరియు సాధారణ ప్రజలలో మత్తుపదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, గత మూడేళ్లలో అందించిన విశేష విజయాలు కారణంగా ఈ అంతర్జాతీయ గౌరవం ఆయనకు లభించింది. ఈ రోజు దుబాయ్, యుఏఈ లోని దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్ లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో సి.వి. ఆనంద్ ఐపీఎస్ ఈ ప్రతిష్టాత్మక "ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కొటిక్స్ అవార్డు" ను వరల్డ్ పోలీస్ సమిట్ కమిటీ నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ప్రపంచంలోని 138 దేశాల నుండి ప్రముఖ పోలీసు అధికారులు ఈ అంతర్జాతీయ పోలీస్ సమ్మేళనంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్-న్యూ (హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్) ఈ అవార్డును గెలుచుకోవడం పట్ల ఆయన గర్వంగా భావిస్తున్నట్టు చెప్పారు. వివిధ ఖండాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన పోలీస్ దళాలను పోటీగా ఎదుర్కొని ఈ అవార్డు గెలుచుకోవడం హైదరాబాద్ పోలీసుల కృషికి గుర్తింపుగా నిలిచిందన్నారు. ఈ పురస్కారం తమ బృంద సభ్యుల శ్రమ, నిబద్ధత ఫలమని పేర్కొంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం తెలంగాణా పోలీసులకు మాత్రమే కాకుండా భారతదేశ పోలీస్ వ్యవస్థ మొత్తానికి గర్వకారణమని ఆయన అన్నారు. హెచ్-న్యూ ద్వారా అమలు చేస్తున్న వినూత్న విధానాలు, సమగ్ర దృష్టికోణం ఈ గుర్తింపు కారణమని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 దేశాల నుండి వచ్చిన 12 మంది పోలీస్ అధికారులు మరియు ఇన్నోవేటర్లు వివిధ శ్రేణులలో మొదటి బహుమతులను అందుకున్నారు. అవార్డు కార్యక్రమానికి ముందు జరిగిన ప్యానల్ చర్చలో ఆనంద్ మాట్లాడుతూ, కోవిడ్ అనంతరం భారత్లో పెరుగుతున్న మత్తుపదార్థాల సమస్యల గురించి, దేశంలోకి మత్తు పదార్థాలు ఎలాంటి మార్గాల్లో ప్రవేశిస్తున్నాయో, పట్టుబడిన ముఠాలు మరియు సరఫరాదారుల గురించి, విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలతో మత్తుపదార్థాల వ్యతిరేకంగా అవగాహన ప్రచారాలు, పునరావాస చర్యలు మొదలైన అంశాలపై చర్చించారు.