ఉగ్రవాదుల స్థావరాలు గుర్తింపు.. వైర్లెస్ సెట్లు స్వాధీనం
పాకిస్తాన్ ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. పేలుడు పదార్థాలైన ఐఈడీలు, వైర్లెస్ సెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం సురాన్ కోట్ లోని మర్హోట్ ప్రాంతం సురాన్ తల్ లో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అటవీ ప్రాంతంలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించారు. కాగా, స్టీల్ బకెట్లలో అమర్చిన రెండు ఇంప్రూవైజ్డ్ పేలుడు పదార్థాలు, మూడు టిఫిన్ బాక్సుల్లో ప్యాక్ చేసిన ఐఈడీలను కనుగొన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
కాగా సరిహద్దు జిల్లాలో పేలుళ్లు జరుపాలన్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసినట్లు చెప్పారు. అర కిలో నుంచి ఐదు కిలోల బరువుతో పేలేందుకు సిద్ధంగా అమర్చిన ఈ ఐదు ఐఈడీలను అక్కడికక్కడే నియంత్రిత పద్ధతిలో పేల్చి ధ్వంసం చేసినట్లు తెలిపారు. మరోవైపు ఉగ్రవాదుల రహస్య స్థావరంలో పలు వస్తువులను కూడా గుర్తించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రెండు వైర్లెస్ సెట్లు, ఐదు యూరియా ప్యాకెట్లు, ఐదు లీటర్ల గ్యాస్ సిలిండర్, ఒక బైనాక్యులర్, మూడు ఉన్ని టోపీలు, మూడు దుప్పట్లు, కొన్ని దుస్తులు, పాత్రలను ఈ స్థావరం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.