నీళ్లు ఆపితే అణ్వాయుధ దాడి.. పాక్ వార్నింగ్..
తమ దేశానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటే ఊరుకునే పరిస్థితి లేదని పాకిస్తాన్ వార్నింగ్ చర్యలు చేపట్టింది. నీటిని దారి మళ్లించినా కూడా ఆ పరిస్థితిని తిప్పి కొడతామని, అవసరం అయితే అణ్వాయుధ దాడి చేపడతామని పాకిస్తాన్ తెలిపింది. కాగా రష్యాలోని పాకిస్తాన్ అంబాసిడర్ మొహమ్మద్ ఖలీద్ జమాలీ ఈ కామెంట్స్ చేశారు. రష్యా న్యూస్ మీడియా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండో, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే. పాక్ చర్యలను ఖండిస్తూ సింధూ జలాలను ఆపేందుకు భారత సర్కారు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ క్రమంలో సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ.. తాజాగా చీనాబ్ నది నీటిని రిలీజ్ చేయడం లేదు. ఒకవేళ నీళ్లను అడ్డుకున్నా లేక దారి మళ్లించినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆ అంబాసిడర్ పేర్కోన్నారు. నీళ్లను అడ్డుకోవడాన్ని, డైవర్ట్ చేయడాన్ని యుద్ధ చర్యగా భావిస్తామని, దీన్ని పూర్తి స్థాయిలో తిప్పికొడుతామన్నారు. ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే రెండు దేశాల సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.