ఇంత దారుణమా.. పహల్గాం మృతుడి భార్యపై ట్రోలింగ్..
పహల్గాం ఉగ్రదాడి మృతుడి భార్యను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై నేషనల్ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యక్తీకరణను తప్పుపడుతూ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని తెలిపింది. కాగా ఏప్రిల్ 22వ తేదీన జరిగిన దాడిలో మృతి చెందిన వారిలో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా కామెంట్స్ చేయొద్దని ఆయన భార్య హిమాన్షి రిక్వెస్ట్ చేసింది. ఈ మాటలు కొందరు నెటిజన్స్ కు నచ్చలేదు.. దాంతో ఆమెను విమర్శిస్తూ ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమెను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. దీనిపై కేంద్రం స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేసిన తరుణంలోనే మహిళా కమిషన్ రియాక్ట్ అయింది.
ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిలో ఎన్నో కుటుంబాలకు తీరని లోటు ఏర్పడింది అని మహిళ కమిషన్ తెలిపింది. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ను కూడా మతం అడిగి, ప్రాణాలు తీశారు. ఉగ్రదాడిపై దేశం మొత్తం కోపంగా ఉంది. ఈ క్రమంలో ఆయన భార్య హిమాన్షి నర్వాల్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో వస్తోన్న విమర్శలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదు.. ఏదైనా కామెంట్ చేసేటప్పుడు మర్యాదగా, రాజ్యాంగ విలువలకు లోబడి ఉండాలని ఈ సందర్భంగా సూచించింది.