పహల్గాం అటాక్.. 'రెండు నెలలు ఆహారం నిల్వ చేసుకోండి..'
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా, పాక్ మధ్య ఉద్రికతలు పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఆహార పదార్ధాలను నిల్వ చేసుకోవాల్సిందిగా పౌరులను పాక్ ఆక్రమిత కశ్మీర్ కోరినట్టు మీడియా వర్గాలు తెలిపాయి. లోకల్ అసెంబ్లీని ఉద్దేశించి పీఓకే ప్రధానమంత్రి చౌదరి అన్వర్ అల్ హక్ ప్రసంగిస్తూ, ఎల్ఓసీ వెంబడి 13 నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు ఆహార పదార్ధాలు నిల్వ చేసుకోవాలని పీఓకేలోని ప్రజలకు ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఆహార పదార్ధాలు, మెడిసన్లు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రూ.100 కోట్ల అత్వసర నిధిని పీఓకే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు హక్ ను ఉటంకిస్తూ ఓ న్యూస్ ఒక కథనంలో పేర్కొంది.
కాగా, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తాజాగా గిల్గిట్, స్కర్దు సహా పీఓకేలోని ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని విమానాలను భద్రతా కారణాల రీత్యా రద్దు చేసినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి. కరాచీ, లాహోర్ నుంచి స్కర్దుకు వెళ్లే రెండు విమానాలు, ఇస్లామాబాద్ నుంచి స్కర్దు వెళ్లే రెండు విమానాలు, ఇస్లామాబాద్ నుంచి గిల్గిట్ వెళ్లే నాలుగు విమానాలు రద్దయినట్టు మీడియా సంస్థ తెలిపింది. కాగా పహల్గాం ఘటనలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు వదిలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.