తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధానకార్యదర్శిగా రామకృష్ణారావు నియామకం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కే రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఏప్రిల్ 30 పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి కార్యాలయంలో మార్పులు చేర్పులు చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పరిపాలన ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. కొత్త సీఎస్ నియామకంపై గత కొంత కాలంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. రామకృష్ణారావుతోపాటు ఆరుగురు అధికారులు రేసులో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావును సీఎస్ గా నియమించాలని నిర్ణయించింది. ఈయన 2014 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.