సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల నుంచి సంచలన లేఖ విడుదలైంది. భద్రతా బలగాలు కొనసాగిస్తున్న భారీ కూంబింగ్ ఆపరేషన్ను తక్షణం నిలిపేయాలని లేఖలో కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ ప్రకటనను బస్తర్ ప్రాంతానికి చెందిన మావోయిస్టు ఇన్ఛార్జ్ రూపేశ్ విడుదల చేశారు.
ప్రస్తుతం ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు విస్తృతంగా ఆపరేషన్ చేపట్టాయి. ముఖ్యంగా కర్రెగట్ట, నాడ్పల్లి, పూజారి కాంకేర్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు బెటాలియన్ నెం.1 స్థావరంపై దాడులు కొనసాగుతున్నాయి.
ఈ స్థావరంలో మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలు, కీలక కమాండర్లు ఉన్నట్లు సమాచారం. దాదాపు 10 వేల మంది శిక్షణ పొందిన కమాండోలు ఈ ప్రాంతంలో మోహరించారని తెలుస్తోంది. మావోయిస్టులను పూర్తిగా నిరోధించేందుకు ఇది చరిత్రలోనే అతి పెద్ద ఆపరేషన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.