ఆర్టీసీ బస్లో జన్మించిన చిన్నారికి జీవితకాలం ఉచిత బస్పాస్..!
హైదరాబాద్ TPN : టీజీఎస్ఆర్టీసీ బస్సులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్బిణీ కాన్పుకు సాయం చేసి మానవత్వం చాటుకున్న హైదరాబాద్-2 డిపోకు చెందిన కండక్టర్ రాజ్కుమార్, ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ వేణుగోపాల్, ఆశా కార్యకర్త మల్లి కాంతమ్మను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్లో ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించారు. అలాగే ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ను అందిస్తున్నట్లు ప్రకటించారు. బస్లో కాన్పు చేసిన ఆశా కార్యకర్త మల్లి కాంతమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్ను జారీ చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్-కొల్లాపూర్ రూట్ ఎక్స్ప్రెస్ బస్సులో సువర్ణ అనే గర్భిణి నాగర్ కర్నూల్లో వైద్య పరీక్షలు ముగించుకుని ఈ నెల 15న సొంతూరికి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలో పెద్ద కొత్తపల్లి మండలం అదిరాల గ్రామ సమీపంలోకి బస్సు రాగానే ఆమెకు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. ఆ సమయంలో గర్భిణి వెంట ఆశా కార్యకర్త మల్లి కాంతమ్మ ఉన్నారు. ఈ విషయాన్ని ఆశా కార్యకర్త గుర్తించి కండక్టర్, ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ రాజ్కుమార్కు సమాచారం అందించారు. వారు వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపారు. ప్రయాణికుల అందరినీ కిందకు దింపారు. ఆశా కార్యకర్త మల్లి కాంతమ్మ ఆమెకు పురుడుపోశారు. ఆడబిడ్డకు సువర్ణ జన్మనిచ్చారు. 108 అంబులెన్స్ సాయంతో తల్లీబిడ్డను వారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సమయస్పూర్తితో వ్యవహారించిన కండక్టర్ రాజ్కుమార్, ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ వేణుగోపాల్, ఆశా కార్యకర్త మల్లి కాంతమ్మను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసించారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు.
గ్రూప్-1 ర్యాంకర్కు సన్మానం..
గ్రూప్-1లో ప్రతిభ కనబరిచిన గోర్ల సుమశ్రీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించి.. సన్మానించింది. వనపర్తి జిల్లా చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన సుమశ్రీ.. ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 179 ర్యాంకును సాధించారు. ఆమె తండ్రి గోర్ల కృష్ణయ్య వనపర్తి డిపోలో గతంలో కండక్టర్గా విధులు నిర్వర్తించారు. కరోనా కాలంలో మరణించారు. ఆయన కూతురు గ్రూప్-1లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని తెలుసుకుని.. ఆమెను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సన్మానించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరును కనబరచాలని ఆమెకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషాదేవి, హైదరాబాద్-2, వనపర్తి డిపో మేనేజర్లు కృష్ణమూర్తి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.