చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ : తలసాని
బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. తెలంగాణ ఉద్యమం 1969లోనే పుట్టిందని.. కానీ.. మధ్యలోనే ఆగిపోయిందన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా కేసీఆర్ నిలిపారని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 వసంతాలు పూర్తవుతుందని.. ఈ నెల 27న పార్టీ పండుగను ఘనంగా నిర్వహిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ శ్రీరామరక్ష అని చెప్పారు. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్నికాంగ్రెస్ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని విమర్శించారు.