సీఎం హైజాక్ అయ్యారు : తేజస్వి యాదవ్
దేశంలోని రాజకీయాలు సైతం ఉత్కంఠభరితంగా ఉన్నాయని అనేందుకు నిదర్శనంగా బీహార్ పాలిటిక్స్ నిలిచాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హైజాక్ అయ్యారని ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వంతో జరిగిన సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్లో ప్రతిపక్ష కూటమి పటిష్టంగా ఉందని, బీహార్ ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. బీహార్లోని ప్రతిపక్ష కూటమి పార్టీలు ఈ నెల 17న మరోసారి సమావేశమవుతాయని, పాట్నాలో ఈ సమావేశం జరుగుతుందని అన్నారు. నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలనలో బీహార్ రాష్ట్రం పేద రాష్ట్రంగా మిగిలిపోయిందని విమర్శించారు.
తలసరి ఆదాయం, రైతుల రాబడి తగ్గిపోయాయని, వలసలు పెరిగిపోయాయని తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఇవాళ్టి సమావేశంలో సానుకూల చర్చలు జరిగాయని అన్నారు. ప్రజా సమస్యలను బేస్ చేసుకునే తాము ఎన్నికల్లో తలపడుతామని అన్నారు. ప్రభుత్వ లోపాలను ప్రజలకు అర్థమయ్యేలా ఎత్తిచూపడం ప్రతిపక్షాల బాధ్యత అని తెలిపారు. ప్రతిపక్ష కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అందరం ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.