ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి : టీజీవో
హైదరాబాద్ TPN
ఎక్సైజ్శాఖలోని ఉద్యోగుల బదిలీలతోపాటు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీవో నాయకులు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ను, ఇంచార్జ్ అడిషనల్ కమిషనర్ ఖురేషీని కలిసి విన్నవించారు. ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ల బదిలీలు జరగక దాదాపు 8 సంవత్సరాలు గడిచిందని.. జీవో నంబర్ 317 అమలులో భాగంగా దూర ప్రాంతానికి తప్పనిసరి బదిలీలు చేశారని.. ఇలాంటి ఉద్యోగులందరూ మూడున్నర సంవత్సరాలు గడిచినా.. బదిలీలకు నోచుకోలేదని.. ఎన్నికల తిరుగు బదిలీలు కూడా జరపలేదని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు విన్నవిస్తే ఆయన హామీ ఇచ్చారని గుర్తిచేశారు. కొన్ని నెలల క్రితం సాధారణ బదిలీల సందర్భంగా మార్గదర్శక ఉత్తర్వులు జారీ చేసినా.. ఎక్సైజ్ శాఖలో ఎప్పుడైనా బదిలీలు చేసుకోవచ్చని తెలిపారన్నారు. ఈ వేసవి సెలవుల్లో బదిలీలు జరగకపోతే పిల్లల అడ్మిషన్ల పరంగా, కుటుంబాలను దూర ప్రాంతాలకు తరలించాల్సిన విషయంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందిని తెలిపారు. కాబట్టి.. ఈ వేసవిలోనే బదిలీలు చేయాలని కోరగా.. కమిషనర్ సానుకూలంగా స్పందించి.. అతి త్వరలోనే బదిలీలు చేస్తామని హామీ ఇచ్చారు. దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులు, సర్వీస్ రూల్స్ సవరణలు, విధి నిర్వహణలో ఉండి ప్రమాదానికి గురి అయిన వారికి స్టేట్ బ్యాంక్ వారితో అవగాహన ఒప్పందం చేసుకొని ప్రమాద భీమా కల్పించాలనే డిమాండ్లను విన్నవించగా.. తన పరిధిలోని సమస్యలన్నింటినీ పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తానని కమిషనర్ తెలిపారు.