ఏపీలో జైషా భారీగా పెట్టుబడులు..?
- ఏపీలో పెట్టుబడులకు జైషా ప్రణాళికలు
- మంత్రి లోకేష్కు జైషా ప్రతిపాదనలు
- జైషా ప్రతిపాదనలకు లోకేష్ గ్రీన్సిగ్నల్
- రిఫైనరీస్, మైన్స్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు
- త్వరలోనే జైషా పెట్టుబడులపై ప్రకటన
ఐసీసీ, బీసీసీఐలో తనదైన ముద్ర వేసిన కేంద్ర హోమంత్రి అమిత్షా కుమారుడు జైషా ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. అదికూడా ఏపీలోనే ఆయన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఏపీలో తీరప్రాంత కారిడార్లో అందుబాటులో ఉన్న సహజ వనరులపై ఆయన దృష్టి ఉంది. గుజరాతీ అయినందున పొడవైన తీరప్రాంత కారిడార్ యొక్క ప్రయోజనం ఆయనకు బాగా తెలుసు. భారతదేశంలోనే అతి పొడవైన తీరప్రాంతం గుజరాత్కు ఉంది. ఇక ఈ పెట్టబడుల అంశంపై ఏపీ మంత్రి నారా లోకేష్తో ఇప్పటికే జైషా కీలక మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఎంపీ సతీష్ సమన్వయంతో జైషా, లోకేష్ ఇద్దరూ పాల్గొన్న కీలకమైన సమావేశంలో.. సానుకూలంగా ఫలితాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖపట్నంలో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారట. జైషా ఈ మీటింగ్పై ఆసక్తి చూపించమే కాకుండా.. స్వయంగా అనేక విషయాలను కూడా ప్రతిపాదించినట్లు టాక్ వినిపిస్తోంది. అటు లోకేష్ కూడా ఈ ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇకపోతే.. రిఫైనరీస్, మైన్స్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టబోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సహజ వనరులకు సంబంధించి ఒక్క అదానీకి మాత్రమే పెద్ద వెంచర్స్ ఉన్నాయి. జైషా ప్రణాళికలు ఫలిస్తే రాష్ట్ర సహజ వనరులకు సంబంధించిన వెంచర్స్ను ఆయన కూడా లాంచ్ చేయనున్నారు. దీంతో రాష్ట్రానికి పెద్ద పెట్టుబడులు వచ్చిపడతాయి. ఐతే.. ఈ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతవరకు దారితీస్తాయన్నది చూడాలి. మరోవైపు ఈ పెట్టుబడులన్నీ ఎక్కువగా సహజ వనరులు ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల జీవనోపాధికి హాని కలిగిస్తున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ ఆరోపణలకు కూటమి సర్కార్ ఎలాంటి సమాధానం ఇస్తుందో కూడా చూడాల్సి ఉంది.
మరోవైపు జైషా గుజరాత్ క్రికెట్ బోర్డు నుంచి తన కెరీర్ను ప్రారంభించి, ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా ఉన్నారు. అలాగే బీసీసీఐ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ఆయనకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ.. వ్యాపార రంగంలోకి మాత్రం తన తండ్రి, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆశీర్వాదాలతోనే అడుగుపెడుతున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇక ఇప్పుడు జైషాతో ఉన్న సాన్నిహిత్యం అటు లోకేష్కు కూడా భవిష్యత్లో ఉపయోగపడుతుందని రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు. మొత్తానికి త్వరలోనే ఏపీలో జైషా పెట్టుబడుల గురించి పెద్ద ప్రకటనలు వినబోతున్నట్లు తెలుస్తోంది.