రైతులు ప్రకృతి వ్యసాయాన్ని స్వీకరించే దిశగా సాగాలి - తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
శంకర్పల్లిలో ప్రకృతి, సేంద్రియ రైతు సమ్మేళనం
శంకర్ పల్లి , ఏప్రిల్ 4 : రైతులు సేంద్రియ (ప్రకృతి) వ్యవసాయాన్ని స్వీకరించే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని బద్దం సురేందర్రెడ్డి గార్డెన్లో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి, సేంద్రియ రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. భూమి మనకు దేవుడిచ్చిన వరమని, మన పూర్వీకులు భూమిని పరిరక్షిస్తూ, ప్రకృతికి అనుగుణంగా సాగు చేశారని అన్నారు. రసాయనాల ప్రభావం, రసాయనిక ఎరువుల వాడకంతో మట్టిలో సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతోందని, ఇది భవిష్యత్ తరాలకు ముప్పుగా మారుతుందన్నారు. రసాయనాల సాగువల్ల పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. మనం స్వచ్ఛమైన ఆహారాన్ని అందించకపోతే, భావితరాలకు ముప్పు తప్పదని, ప్రకృతి వ్యవసాయ విధానాల్లో రసాయనాలకు చోటుండదని, తక్కువ పెట్టుబడిలో అధిక లాభం పొందవచ్చన్నారు. దీనికి మీరు సేంద్రియ ఎరువులను స్వయంగా తయారు చేసుకోవాలని. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలుం కూడా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించే దిశగా పనిచేస్తున్నాయని అన్నారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు, ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం రైతులు ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన వివిధ స్టాల్స్ను గవర్నర్, ఎమ్మెల్యే తిలకించి వారికి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.