సాకేత్ కార్యాలయం ఎదుట ధర్నా
మేడ్చల్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడవెల్లి సాకేత్ భూసత్వ ఫేస్ 1 గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుగోలు చేసిన వృద్ధులు యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపోయామని, హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ వారు సాకేత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
బాధితుల మాటల్లోకి వెళితే, ప్రాజెక్ట్ను 2011లో ప్రారంభించారని, ఇప్పటికీ 13 ఏళ్లైనా పూర్తి కాలేదని వాపోతున్నారు. సుమారు 200 విల్లాల వాసులు మౌలిక వసతుల కోసం ఎదురు చూస్తున్నారని, తమకు హామీలుగా చెప్పిన బ్యాటరీ కార్ సౌకర్యం, భద్రత, ఫ్లాట్ల మరమ్మత్తులు ఇంకా అమలు కాలేదన్నారు.
HMDA నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలు కల్పించాలి అంటూ వారు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. “తాము వృద్ధులమని తెలిసీ ఇలాంటివిధంగా తప్పుడు హామీలతో ఇబ్బంది పెడుతున్నారంటే అది అన్యాయమన్నారు.”
ఈ కార్యక్రమంలో సాకేత్ ప్రణామం సీనియర్ సిటిజన్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరంగరావు, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. సుమారు 50 మంది సభ్యులు ధర్నాలో భాగమయ్యారు.