సోదాలతో హోరెత్తించారు.. అక్రమ మద్యం అరికట్టారు..
హైదరాబాద్: నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై ఎక్సైజ్ అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్పలితాలు ఇచ్చింది. వారం రోజుల్లో పలు రాష్ట్రాల నుండి తీసుకు వచ్చిన రూ. 25 లక్షల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3 నుంచి 9 వరకు తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో రూ. 25 లక్షల విలువ చేసే లిక్కర్, బీర్, దేశీదారు మద్యాన్ని ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది.
ఈ దాడుల్లో ఎస్టిఎఫ్, ఏసీ ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ టీమ్లతో పాటు ఎక్సైజ్స్టేషన్ సిబ్బంది కలిసి నిర్వహించిన దాడుల్లో 64 కేసులు నమోదు చేశారు.
33 మందిని అరెస్టు చేసి 19 వాహనాలను సీజ్ చేశారు. దాడుల్లో 1188 మద్యం బాటిళ్లు, 22 లీటర్ల బీరు బీటిళ్లు, 21 లీటర్ల దేశీదారు లిక్కర్ను ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఇచ్చిన ఆదేశాల మేరకు ఢిల్లీ, గోవా నుంచి వచ్చే రైళ్లలో ఎస్టిఎఫ్ టీమ్లు తనిఖీలు నిర్వహించి మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానం వచ్చిన వారి బ్యాగులను తనిఖీలు నిర్వహించిన క్రమంలో 40 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
గోవా నుంచి వాస్కోడిగామా రైల్ లో ఎస్టి ఎఫ్ టీమ్లతోపాటు వికారాబాద్కు చెందిన ఎక్సైజ్, డీటిఎప్ సిబ్బంది కలిసి జరిపిన దాడుల్లో నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ పట్టుబడింది.
ఏసీ రంగారెడ్డి , శంషాబాద్ డీటిఎప్ జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో ఎన్డీపీఎల్ మద్యం పట్టుబడింది. గోవా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం తోపాటు డిపెన్స్ మద్యం బాటిళ్లను పెద్ద మొత్తంలో పట్టుకున్నారు.
శంషాబాద్, సరూర్నగర్, మల్కాజ్గిరి, వికారాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మెదక్, వరంగల్ అర్బర్, కరీంనగర్లో ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించి నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు. అదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్ , కామారెడ్డి ప్రాంతాల్లో దేశీదారు మద్యంను పట్టుకున్నారు. ఇదే తీరును కొనసాగించాలని డైరెక్టర్
షానవాజ్ ఖాసీం తెలిపారు. సిబ్బందిని అభినందించారు.