సిట్ ఎదుట విచారణకు హాజరైన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు..
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ విచారణకు హాజరయ్యారు. 15 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరకున్నారు. పంజాగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రవీణ్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. ఈ కేసు నమోదైన సమయంలోనే ఆయన అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్ పోర్ట్ రద్దు చేయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో ఆదివారం రాత్రి 8.20 గంటల సమయంలో ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరవుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి.