ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఆటోనగర్లోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సాక్షి ఛానెల్లో జరిగిన ఒక డిబేట్లో మహిళలపై చేయబడ్డ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన కూటమి పార్టీల మహిళా నేతలు, రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు. వారు సాక్షి బోర్డు పీకేసి, కోడిగుడ్లను విసిరి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పటమట పోలీసులు అడ్డుకున్నారు. సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద పెద్దఎత్తున నిరసన కొనసాగుతోంది. "సాక్షి ని అడ్డం పెట్టుకుని నీచంగా మాట్లాడతారా? రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలపై నోరు పారేసుకుంటారా?" అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కించపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సాక్షి యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, డిబేట్లో పాల్గొన్న ఇద్దరినీ శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ మొత్తం ఘటనపై భారతీ రెడ్డి ఇప్పటికీ స్పందించకపోవడంపై మహిళలు అసహనం వ్యక్తం చేస్తూ, ఆమె కూడా అదే కోవకే చెందిందా అంటూ ప్రశ్నించారు.