సారుకు ఫోనే లోకమాయే...ప్రజా సమస్యలు పట్టవాయే..
మేడ్చల్ : ఫోనే లోకమన్నట్టు వ్యవహరించిన అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. తానే పూర్తి బాధ్యత తీసుకొని, సమావేశాన్ని నడిపించాల్సి ఉండగా ఫోన్లోనే ఉండటం విమర్శలకు తావిచ్చింది. తూముకుంట మున్సిపల్ పరిధిలోని బొమ్మరాసిపేట్ గ్రామంలో రెవెన్యూ సదస్సలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుంది. సదస్సుల ద్వారా భూ భారతి చట్టంపై అవగాహన కల్పిస్తుంది. ధరణిలో పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంగా తీసుకువచ్చిన చట్టం ద్వారా లబ్ఢి పొందాలని రైతులకు సూచిస్తూ ఎలా వినియోగించుకోవాలనే విషయంపై హెల్ప్ డెస్క్లను కూడా నిర్వహిస్తోంది. ఇంత ప్రాధాన్యత ఉన్న రెవెన్యూ సదస్సు లక్ష్యంగా నీరు గార్చేలా తాసిల్దారు యాదగిరిరెడ్డి వ్యవహరించారు. ప్రజల సమస్యల వినకుండా ఫోన్లోనే మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ముందు నిలిచి వున్న రైతులు ఎప్పుడు ఫోన్ నిలిపివేస్తాడు, తమ గోడు వెళ్లబోసుకుందామని ఎదురు చూశారు. ఎంతకు ఆయన ఫోన్లో మాటలు ఆగకపోవడంతో విసిగిపోయి ఒక్కింత నొచ్చుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించి పొటో తీసిన విలేకరులపై ఆయన చిర్రుబుర్రులాడారు. బయట పెట్టారో తాట తీసి కేసులు పెడతా అంటూ హెచ్చరించారు. సారు తీరు చూసి జనం మండిపడ్డారు.