డేట్ ఫిక్స్ అయ్యింది.. సార్ వస్తున్నారు.. గెట్ రెడీ..
- కాస్త విరామం తరువాత మళ్లీ జోరందుకొనున్న ఫోన్ ట్యాపింగ్ కేస్..
- జూన్ 5న ప్రభాకర్ రావు విచారణకు హాజరుకనున్నట్లు సమాచారం..
- ప్రభాకర్ రావు స్టేట్మెంట్ పైనే ముడిపడి ఉన్న దర్యాప్తు..
- కేసీఆర్ కి ఈ కేసులో కూడా తప్పని చిక్కులు అంటున్న నేతలు..
కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులు.. కవిత తిరుగుబాటుతో చిరాకుగా ఉన్న బిఆర్ఎస్ బాస్ కి మరో తలనొప్పి రావడం ఖాయం అయ్యింది. ఆ కేసులో కూడా ఆయన నోటీసులు అందుకొని విచారణకు రావాల్సి ఉంటుంది. అదే ఫోన్ ట్యాపింగ్ కేస్.. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి టి.ప్రభాకర్రావు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరుకానున్నట్లు తెలిసింది. ఆయన ఈ నెల 5న సిట్ అధికారుల ముందు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 నెలలుగా అమెరికాలో ఉంటున్న ప్రభాకర్రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత్కు తిరిగి రానున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని సర్వోన్నత న్యాయస్థానానికి ఆయన ఒక హామీపత్రం కూడా సమర్పించినట్లు సమాచారం. వన్ టైమ్ ఎంట్రీ పాస్పోర్టు జారీ అయిన వెంటనే ఆయన భారత్కు బయలుదేరనున్నారు. పాస్పోర్టు అందిన మూడు రోజుల్లోగా దేశానికి తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్రావు సిట్ విచారణకు హాజరవుతున్నట్లు దర్యాప్తు బృందానికి తెలియజేశారని తెలుస్తోంది.
ప్రభాకర్రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని, తద్వారా కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందని సిట్ అధికారులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన విచారణ ఈ కేసులో అత్యంత కీలకంగా మారనుందని భావిస్తున్నారు. అయితే ఈ కేసులో కూడా కేసీఆర్ పేరే మొదటి నుండి వినపడింది. ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్ పైనే అందరి దృష్టి పడింది. ఆయన ఎమ్ చెబుతారు.. కేసీఆర్ ని విచారణకు పిలుస్తారా అనే చర్చ నడుస్తోంది. ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారు అనే వ్యవహారం మోదలైండి. ఏదిఏమైనా ఈ కేసులో అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు వస్తున్నాడని తెలియడం కేసు ఓ కొలిక్కి వచ్చినట్లైంది అని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.