అక్షయ విద్య ఫౌండేషన్ ను అభినందించిన డీజీపీ జితేందర్..
హైదరాబాద్: అక్షయ విద్య ఫౌండేషన్ బస్తీ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద విద్యార్థులకు విలువైన సేవ చేస్తుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ప్రశంసించారు. హైదరాబాదులోని పలు ప్రాంతంలో ఉన్న బస్తీలలో ఉన్న పేద విద్యార్థులు గురుకుల పాఠశాలలో ఎంపికైన సందర్భంగా వారి అభినందన కార్యక్రమం డిజిపి కార్యాలయంలో శనివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిజిపి మాట్లాడుతూ... అక్షయ విద్య ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వినియోగించుకుని బస్తీలో ఉన్న పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశించారు. బాల్యంలో చక్కటి లక్ష్యాలను ఏర్పరచుకొని నిరంతరం కృషి చేయాలి అన్నారు. ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న వారందరూ లక్ష్యాల కోసం కృషిచేసి సాధించిన వారని, వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. అక్షయ విద్య అందిస్తున్న ఉచిత విద్యను నేర్చుకొని సత్ప్రవర్తనతో ఉత్తమ వ్యక్తులుగా ఎదగాలన్నారు. భారతదేశం ప్రస్తుతం అతిపెద్ద నాలుగవ ఆర్థిక దేశంగా ఎదిగిందని, తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి సాధించిందని అన్నారు. అందరూ చిత్తశుద్ధితో కృషి చేస్తే పురోగతి సాధిస్తారని, మనం ఏరకమైన ఆలోచనలతో ఉంటే ఆ రకంగా రూపుదిద్దుకుంటామని అభిప్రాయపడ్డారు. విద్యార్థులుగా మీరు కష్టపడితే భవిష్యత్తులో ఉన్నతాధికారులు, డాక్టర్లు, న్యాయవాదు లు వంటి స్థాయిలు పొందవచ్చనీ, ఆ దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ రకమైన సేవా కార్యక్రమాలకు పొలిస్ శాఖ సహకరిస్తుందని, ఐజిపి ఎం.రమేష్ ఈ సంస్థతో ఇప్పటికే అనుబంధంగా ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులను వారి తల్లిదండ్రులను డిజిపి అభినందించారు. ఐజిపి ఎం రమేష్, జి అరుంధతి రెడ్డి, ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎస్ జనార్ధన్, టి .వరప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.