తిరుమలలో చిరుత సంచారం.. శ్రీవారి భక్తులలో నెలకొన్న భయం..
గతంలో లాగే తిరుమలలో మరోసారి చిరుతల సంచారం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. తాజాగా అలిపిరి నడకమార్గం, మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచరించింది. ఈ మార్గంలో తిరుమలకు వెళ్తోన్న భక్తులకు తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల తిరుపతి శేషాచలం అడవుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరుగుతోందనడానికి తాజా ఉదంతం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత ఏడాది చిరుతల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనలకు గురి చేసిన విషయం తెలిసిందే. అలిపిరి, శ్రీవారిమెట్లు, గాలిగోపురం పరిసర ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి. వాటి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ సహా మొత్తం ఏడు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు. గత ఏడాది అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తోన్న నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. కాలినడకన తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను చిరుత బారిన పడకుండా ఉండటానికి తక్షణ రక్షణగా చేతికర్రలను అందించింది అప్పటి పాలక మండలి.
ఇప్పుడు మరోసారి చిరుతల బెడద మొదలైంది. అలిపిరి కాలిమార్గం, మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచరించించింది. 350వ మెట్టు సమీపంలో భక్తులు చిరుతను గుర్తించారు. భయంతో భక్తులు పరుగులు తీశారు. వెంటనే టీటీడీ భద్రత సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందిన వెంటనే భద్రత సిబ్బంది హుటాహుటిన 350 మెట్టు, మొదటి ఘాట్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. భక్తులను అప్రమత్తం చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో గుంపులు పంపించారు. మైక్ లో గోవింద నామాలు జపిస్తూ భక్తులు కొండపైకి గుంపులు గుంపులుగా బయలుదేరి వెళ్లారు. మైక్ లో అలికిడి చేయడం వల్ల చిరుత బెదిరిపోతుందని, భక్తుల వద్దకు వచ్చే ప్రయత్నం చేయదని టీటీడీ సిబ్బంది వివరించారు.
భక్తులు ఒంటరిగా కొండపైకి వెళ్లొద్దని సూచించారు. గుంపులుగా మాత్రమే వెళ్లాలని కోరారు. 12 సంవత్సరాలలోపు వయస్సున్న వారిని ఈ మార్గంలో అనుమతించకూడదని ప్రాథమికంగా నిర్ణయించారు. భక్తుల భద్రత కోసం టీటీడీ అటవీ విభాగం సిబ్బంది అలిపిరి నడకమార్గం పొడవునా, ఘాట్ రోడ్డులలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకల వల్ల అవి ప్రమాదానికి గురి కాకుండా, భక్తులు ఇబ్బంది పడకుండా కట్టుదిట్టం చేశారు.