పోలీస్ శాఖకు అధునాతన భవనాలు.. సీపీ సి.వి. ఆనంద్..
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం నేపధ్యంలో గోషామహల్ స్టేడియంలో ఉన్న పోలీసు గుర్రపుశాలల తరలించారు. ఈ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం సివి ఆనంద్ గారు మాట్లాడుతూ, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్నందున, పోలీస్ శాఖకు చెందిన బ్లాకులను తరలిస్తున్నామని తెలిపారు. హార్స్ గ్రౌండ్ మరియు గుర్రపుశాలను తాత్కాలికంగా గోషామహల్ పోలీస్ స్టేడియంలోని ఖాళీ స్థలంలోకి తరలించామని చెప్పారు. నేటితో తమ శాఖకు చెందిన అన్ని విభాగాలను తరలించి, వైద్య శాఖకు అప్పగించనున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వం హైదరాబాద్ సిటీ పోలీసుకు ఇక్కడే 11.5 ఎకరాలు కేటాయించిందని, దీనిలో రెండు 5 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నామని కమిషనర్ వివరించారు. ఒకటి సి.ఎస్.డబ్ల్యు (City Security Wing) కోసం, మరొకటి నగరంలో 7 జోన్లలో సీజ్ చేసిన పలు వాహనాలను నిలిపి ఉంచడానికి (పార్కింగ్ కోసం) అనువుగా ఉండే విధంగా తయారు చేయబోతున్నామని తెలిపారు. మరియు గుర్రపుశాలను, మరియు గ్రౌండును తయారుచేస్తున్నామని, అదేవిధంగా, ప్రభుత్వం టిటిఐ (Traffic Training Institute) ప్రక్కన మరో 2 ఎకరాలు కేటాయించిందని, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ. 55 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ భవన నిర్మాణాన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సుమారు సంవత్సరంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
"స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్" ఏర్పాటు..
హైదరాబాద్ నగరంలో ధర్నాలు, ర్యాలీలు, నిరసన దీక్షలు వంటివి ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటాయని, ఆ సమయంలో మహిళలను అరెస్ట్ చేయాల్సి వస్తే చాలా ఇబ్బందికరంగా ఉండేదని సి.వి. ఆనంద్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి హైదరాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్లో కొత్తగా ఎంపికైన 35 మంది మహిళా కానిస్టేబుళ్లతో ఒక టీమ్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ టీమ్కు "స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్" అని నామకరణం చేశారని తెలిపారు. వీరికి గత కొన్ని రోజులుగా కరాటేలో శిక్షణతో పాటు, ధర్నాల సమయాలలో మహిళలను ఏ విధముగా అదుపులోకి తీసుకుని సురక్షితంగా తరలించాలనే దానిపై ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చామని కమిషనర్ గారు వివరించారు. త్వరలో ఇంకా కొంతమందిని చేర్చుకుని 42 మందితో రెండు ప్లాటూన్లుగా విభజిస్తామని ఆయన అన్నారు. స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్ను ఇంత మంచిగా తయారు చేసిన అధికారులకు మరియు టీమ్ సభ్యులందరినీ అభినందించినారు. ఈ కార్యక్రమానికి రక్షిత కృష్ణ మూర్తి డిసిపి సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ మరియు డి.కిష్టయ్య, అడిషినల్ డిసిపి, ఎన్.భాస్క్ ర్ అడిషినల్ డిసిపి మరియు వెస్ట్ జోన్ అడిషినల్ డిసిపి ఇక్బాల్ సిద్దిఖీ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గోన్నారు.