పైలెట్ ప్రాజెక్ట్ కింద ట్రాన్స్ జెండర్లకు మరిన్ని ఉద్యోగాలు. మంత్రి సీతక్క

By Ravi
On
పైలెట్ ప్రాజెక్ట్ కింద ట్రాన్స్ జెండర్లకు మరిన్ని ఉద్యోగాలు. మంత్రి సీతక్క

ట్రాన్స్‌జెండర్ల సాధికారత మరియు భాగస్వామ్యం వైపు ఒక కీలక అడుగు వేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో 44 మంది ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించింది. సమాజంలో వారిని చేర్చుకోవడానికి మరియు వారికి గౌరవప్రదమైన ఉపాధిని కల్పించడానికి ఇది ఒక ముఖ్యమైన చర్య. ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్ వర్గాన్ని చేర్చుకోవాలని దేశంలోనే మొదటిసారిగా నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని, ఆరు నెలల తర్వాత వీరి ప్రవర్తన మరియు వారిపై వచ్చే అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని కోరింది. సచివాలయంలో IMG-20250526-WA0030తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, వాటర్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి  ధనసరి అనసూయ (సీతక్క) అధ్యక్షతన ఒక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి  సి.వి. ఆనంద్ ఐపిఎస్, డిజి మరియు హైదరాబాద్ పోలీసు కమిషనర్, అనితా రామచంద్రన్ ఐఎఎస్, ప్రభుత్వ కార్యదర్శి, మహిళా, శిశు అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ శాఖ (WCD&SC),  బి. శైలజ, డైరెక్టర్/కమిషనర్, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్‌జెండర్ల సాధికారత విభాగం (PWDSC&TGP), ట్రాన్స్‌జెండర్ల ఎన్.జి.ఓ. సంస్థల సభ్యులు మరియు ఇటీవల నియమితులైన ట్రాఫిక్ అసిస్టెంట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా  ధనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే ఒక మైలురాయి అని అన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా వారు చేస్తున్న విధులు అందరినీ సంతృప్తి పరిచాయని ఆమె అభినందించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయని ఆమె తెలిపారు.
ట్రాన్స్‌జెండర్ వర్గానికి అంగవైకల్య కోటా కింద ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఆమె ప్రకటించారు. జిల్లాలో ఇప్పటికే మైత్రీ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని, ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా వారికి మరిన్ని అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం, ట్రాన్స్‌జెండర్ వర్గానికి సమాన అవకాశాలు కల్పించి, అందరినీ సమాజంలో భాగం చేయడమే అని మంత్రి పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా అనితా రామచంద్రన్ ఐఎఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఈ మహత్తర చర్యకు దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వస్తోందని, వివిధ రాష్ట్రాల నుండి ఫోన్‌లు వస్తున్నాయని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టు నివేదిక సమర్పించిన తర్వాత, ఇతర ప్రభుత్వ శాఖలలో మరియు జిల్లాల్లో కూడా ట్రాన్స్‌జెండర్లను నియమించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆమె చెప్పారు.
సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశానుసారం, డిసెంబర్ నెలలో కేవలం 10 రోజులలో ట్రాన్స్‌జెండర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి, ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పోలీసు ట్రాఫిక్ విభాగంలో 38 మంది ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. గత ఆరు నెలల్లో వారిపై ఒక్క చిన్న ఫిర్యాదు కూడా రాలేదని ఆయన గర్వంగా తెలిపారు. వీరు దేశానికే మార్గదర్శకులుగా నిలుస్తారని, ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పిస్తూ ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో మన తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తుందని అన్నారు. ఇతర ప్రైవేటు సెక్యూరిటీ ఉద్యోగాలు చేస్తామంటే సహాయపడతామని, వారికి ఇచ్చిన ఉద్యోగాన్ని మంచి పేరు వచ్చే విధంగా బాధ్యతతో చేస్తే, ప్రభుత్వం కూడా మరింత ప్రోత్సహిస్తుందని ఆయన సూచించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సహకరించి, సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నందుకు అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ట్రాఫిక్ అధికారులు మాట్లాడుతూ, ట్రాఫిక్ అసిస్టెంట్లు పోలీస్ స్టేషన్‌లోని సిబ్బందితో కలిసికట్టుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. డ్యూటీ విషయంలో కూడా వారు వెనకడుగు వేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని, ఇతర సిబ్బందితో కలిసి ట్రాఫిక్ బందోబస్తు డ్యూటీలను కూడా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వీరు సమాజంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చారని, కావున ట్రాఫిక్ విధులను సునాయాసంగా నిర్వహిస్తున్నారని అన్నారు.
ట్రాఫిక్ అసిస్టెంట్లు మరియు ఎన్.జి.ఓ. సభ్యులు మాట్లాడుతూ, గత 76 సంవత్సరాల నుండి ఎవరూ ఇవ్వని గుర్తింపును ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాము ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని, తోటి పోలీసు సిబ్బంది కూడా తమతో మర్యాదగా ఉంటారని, వారితో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో గౌరవంగా ఉందని అన్నారు. ఒకప్పుడు పోలీసులు అంటేనే చాలా భయపడే వారమని, కానీ ఇప్పుడు వారితో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు. ఒకప్పుడు తమ జీవితాలపై తమకే విరక్తి కలిగేదని, అటువంటిది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన తమకు చాలా ధైర్యం వచ్చిందని మరియు సమాజంలో గౌరవం పెరిగిందని అన్నారు. తమకు కూడా ఇతర హోంగార్డులకు ఉన్న సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. యూనిఫారం విషయంలో తమకంటూ ప్రత్యేక రంగు యూనిఫారం ఇవ్వకుండా, హోంగార్డులకు ఉన్నదే ఇవ్వడం ద్వారా తమను కూడా సమానంగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Tags:

Advertisement

Latest News

విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ నగరపాలక సంస్థ08-06-2025  యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలి   ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో ర్యాలీ జరగాలి  
అమరావతిని కించపరిచే వ్యాఖ్యలపై ఎమ్మెల్యే విజయశ్రీ పోలీసులకు ఫిర్యాదు
తెప్పపై శోభాయాత్రలో శ్రీ సుందరరాజ స్వామి
ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి