అమరావతిని కించపరిచే వ్యాఖ్యలపై ఎమ్మెల్యే విజయశ్రీ పోలీసులకు ఫిర్యాదు
తిరుపతి జిల్లా – సూళ్లూరుపేట, 2025 జూన్ 8
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కించపరిచేలా వచ్చిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సూళ్లూరుపేట టీడీపీ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షి టీవీలో ప్రసారమైన చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకుడు కృష్ణమ్మ రాజు చేసిన "అమరావతి వేశ్య రాజధాని" అనే వ్యాఖ్యలు తీవ్రంగా మనస్తాపానికి గురిచేశాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాజధానిపై ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆమె అభిప్రాయపడుతూ, ఈ చర్యలు సామాజిక విలువలను నిరాకరించేలా ఉన్నాయని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నాడు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ను సందర్శించి పట్టణ ఎస్ఐ బ్రహ్మనాయుడుకు అధికారిక ఫిర్యాదు అందజేశారు.
కేవలం విశ్లేషకుడే కాకుండా, కార్యక్రమ హోస్ట్ కూడా స్పందించకపోవడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. వారు చట్టబద్ధమైన విధంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే విజయశ్రీకు మద్దతుగా పోలీస్ స్టేషన్ వద్ద చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు 'అమరావతిని అవమానించటం సహించం' అంటూ నినాదాలు చేశారు.