డెలివరీ బాయ్ పై బ్లేడ్లతో దాడి చేసి దోపిడీ
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్ బాబా నగర్ లో దారుణం చోటుచేసుకుంది. నజీమ్ అనే డెలివరీ బాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడ్లతో దాడి చేసి దోచుకున్నారు. దుండగులు నకిలీ ఆర్డర్ ఇచ్చి డెలివరీ బాయ్ను రప్పించారు. అతను అక్కడికి రాగానే, అతని కళ్లల్లో స్ప్రే కొట్టి, బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న ఫోన్, ద్విచక్ర వాహనం, డబ్బులు లాక్కొని పరారయ్యారు. ఈ దాడి గంజాయి బ్యాచ్ పనే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాయాలతో బాధపడుతున్న డెలివరీ బాయ్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతం ఎప్పుడూ చిమ్మచీకటిగా ఉంటుందని, తరచుగా ఇలాంటి దారిదోపిడీలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు. గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, వెంటనే వారిని అరికట్టాలని స్థానికులు పోలీసులను వేడుకుంటున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.