భారత్ కు అమెరికా హామీ.
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీ చేసే పోరాటానికి తాము అండగా ఉంటామని తెలిపింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ బలంగా నిలబడాలి. అందుకోసం న్యూఢిల్లీ చేసే అన్ని ప్రయత్నాలకు మేం మద్దతు అందిస్తామని, ఉగ్రవాదంపై పోరాటం కోసం భారత్ కు వనరులతో హెల్ప్ చేస్తామని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఇది కూడా భాగమే. భారత్ తో బంధం ఎంత ముఖ్యమో ట్రంప్ యంత్రాంగం అర్థం చేసుకుంది. ఉగ్రవాదం నుంచి ఎదురయ్యే ముప్పు ఎలాంటిదో కూడా మాకు తెలుసు అని మైక్ జాన్సన్ వివరించారు.
అయితే ఈ విషయంలో అమెరికా భారత్ కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్.. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడేలా తీసుకునే చర్యలకు సహకారం అందిస్తామన్నారు. ఉగ్రవాద పోరులో ఇరుదేశాలు కలిసి పోరాడుతాయని అగ్రరాజ్యాధినేత తెలిపారు. పహల్గాం దాడికి పాల్పడిన వారిని కలలో కూడా ఊహించనివిధంగా శిక్షిస్తామని ఇప్పటికే ప్రధాని మోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ దశగా చర్యలు చేపట్టారు.