కెనడా నుంచి హిందువులను పంపించేయండి
కెనడా దేశంలో ఖలిస్థానీలు తమ హవా చూపిస్తున్నారు. తాజాగా ఆ దేశం నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటు వాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాళ్లు భారత ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్షా, విదేశాంగ మంత్రి జై శంకర్ బొమ్మలను ఓ పంజరంలో పెట్టారు. అయితే తాజాగా ఖలిస్థానీ సపోర్టర్లు ఓ మందిరంలో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు షవన్ బిండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు.. ఖలిస్థానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత అని పేర్కొన్నారు. కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణమని రాసుకొచ్చారు.
కాగా ఖలిస్థానీలపై చర్యలు తీసుకోవడంలో కొత్త ప్రధాని మార్క్ కార్నీకి.. మాజీ ప్రధాని ట్రూడోకు ఏమైనా తేడా ఉందా అని క్వశ్చన్ చేశారు. ఖలిస్థానీలు భారత్ కు చెందిన కేంద్ర మంత్రులను బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల రైల్వేశాఖ సహాయమంత్రి రవనీత్ సింగ్ బిట్టూను హత్య చేయడానికి కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా అతడే తెలిపారు. సోషల్ మీడియాలో లీక్ అయిన కొన్ని ఫోటోలు కూడా తన దృష్టికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు.