రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు..
కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుణె కోర్టు నేడు సమన్లు జారీ చేసింది. లండన్ పర్యటన సమయంలో స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ను ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఈ సమన్లు అందాయి. లండన్ పర్యటన సమయంలో రాహుల్ సావర్కర్ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ రాహుల్ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు గతంలో తేల్చారు. కాగా.. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం మే 9న ఆయన తమముందు హాజరుకావాలని కోరుతూ సమన్లు జారీ చేసింది.
కాగా భారత్ జోడో యాత్ర సమయంలో వీర్ సావర్కర్పై రాహుల్ చేసిన కామెంట్స్ కు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. లేటెస్ట్ గా హైకోర్టు రాహుల్కు సమన్లు జారీ చేసింది. వాటిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరగ్గా.. సుప్రీం రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు బాధ్యాతారహితమైనవిగా పేర్కొంది. రాహుల్ వ్యాఖ్యలను మందలిస్తూనే.. ఆయనపై క్రిమినల్ చర్యలను నిలిపివేసింది. దీంతో ఆయనకు భారీ ఊరట లభించింది.