పహల్గామ్ దాడిని సమర్థిస్తూ వ్యక్తి పోస్ట్..
పహల్గామ్ ఉగ్రదాడి.. ఈ ఘటనలో దాదాపుగా 26 మంది అమాయకపు టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. కాశ్మీర్ ను చూడాలని వచ్చిన వారిని విచక్షణారహితంగా మతం వివరాలు అడిగి మరీ హిందువులను కాల్చి చంపారు. ఈ దారుణ ఘటనకు పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ దాడిపై భారత్ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే, పాకిస్తాన్పై దౌత్య యుద్ధం ప్రారంభించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు, పాక్తో సరిహద్దుల్ని మూసేసింది. పాక్ పౌరులు దేశం వదిలివెళ్లాలని హెచ్చరించింది. ఓ వైపు భారతీయుల్ని చంపేశారని యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది దుర్మార్గులు మాత్రం ఈ ఘటనను సమర్థిస్తూ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు.
మరికొంతమందైతే సిగ్గు లేకుండా పాకిస్తాన్ తీరును సమర్థిస్తున్నారు. తాజాగా, పహల్గామ్ దాడిని సమర్థించినందుకు నిచ్చు మంగళూరు అనే ఫేస్బుక్ అకౌంట్ హోల్డర్ పై కర్ణాటకలోని మంగళూరులో కేస్ ఫైల్ చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూర్కి చెందిన ఉల్లాల్ ప్రాంత వాసి సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు నగరంలోని కోనాజే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అల్లర్లను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో కంటెంట్ను ప్రచురించినందుకు, ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా అశాంతిని ప్రేరేపించే లేదా హాని కలిగించే ప్రకటనలను ప్రసారం చేసినందుకు యూజర్పై భారతీయ న్యాయ సంహిత చట్టం, 2023లోని సెక్షన్లు 192 మరియు 353(1)(b) కింద కేసులు ఫైల్ చేశారు.