కర్నూల్ సిటీ–సికింద్రాబాద్ సెక్షన్ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ఈ రోజు హైదరాబాద్ డివిజన్లోని కర్నూల్ సిటీ–సికింద్రాబాద్ సెక్షన్లో తనిఖీ చేపట్టారు. ఆయనతో పాటు డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, ఇతర సీనియర్ అధికారులు కూడా ఉన్నారు.తనిఖీని శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగుళాంబ హాల్ట్ స్టేషన్ వద్ద ప్రారంభించిన జీఎం, అక్కడి ప్రయాణికుల సౌకర్యాలు, ఆస్తులు, పరిసరాలు పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 6.07 కోట్లు వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.తర్వాత కోచ్ మిడ్లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్షాప్ (CMLR) కు అనుసంధానమైన కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. రూ. 562 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వర్క్షాప్ పూర్తయ్యాక నెలకు 50 కోచ్ల మరమ్మతు సామర్థ్యం కలిగించనుంది. మొదట నాన్-ఏసీ కోచ్లు, తరువాత ఏసీ కోచ్ల మరమ్మతులు చేపడతారు.కర్నూల్ ఎంపీ నాగరాజు బస్తీపతితో జీఎం భేటీ కాగా, రైలు అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. అనంతరం కర్నూల్ సిటీ రైల్వే స్టేషన్ను తనిఖీ చేసిన జీఎం, స్టేషన్ వసతులు, సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించారు. అందుబాటులో ఉన్న ఓపెన్ జిమ్, పిల్లల ఆట స్థలం వంటి సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. పచ్చదనం కోసం మొక్కను నాటారు.తుదకు కర్నూల్ నుంచి సికింద్రాబాద్ వరకు రియర్ విండో ఇన్స్పెక్షన్ నిర్వహించిన జీఎం, వాలుతలాలు, వంపులు, వంతెనలు, ట్రాక్ మరియు సిగ్నలింగ్ వంటి భద్రతా అంశాలను సమీక్షించారు.