విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్..
మధ్యప్రదేశ్ TPN : నిత్యం ఎన్నో దారుణాలతో ప్రస్తుత సమాజం కొనసాగుతుంది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు తన బాధ్యతను మరిచిపోయి మరీ దారుణంగా ప్రవర్తించాడు. విద్యార్థులకు దగ్గరుండి మద్యం పోసి వారు తాగేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ కావడంతో అతడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని కఠ్నీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతేకాకుండా స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.
బార్వారా బ్లాక్లోని ఖిర్హానీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో లాల్ నవీన్ ప్రతాప్సింగ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా అతడు కొందరు విద్యార్థులకు మద్యం తాగించాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. అది వైరల్ అయ్యింది. ఈ వీడియో జిల్లా కలెక్టర్ దిలీప్కుమార్ యాదవ్ కంటపడింది. దీంతో ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా విద్యాశాఖాధికారి ఓపీ సింగ్ను ఆదేశించారు. అనంతరం ప్రతాప్సింగ్ను సస్పెండ్ చేశారు. దీంతో ఇకపై సూళ్ళల్లో ఇలాంటి దుర్మార్గపు చర్యలు జరగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు.