జనసేనలోకి గ్రేటర్ విశాఖ వైసీపీ కార్పొరేటర్లు..!
విశాఖపట్నం TPN :
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో.. నాదెండ్ల మనోహర్ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రేటర్ విశాఖ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, జీవీఎంసీ కో-ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు, గాజువాక 74వ డివిజన్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, గ్రేటర్ విశాఖ వైసీపీ యువజన విభాగం నాయకులు ఆళ్ల శివ గణేష్తోపాటు ఆయన అనుచరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు. 91, 92 డివిజన్ల కార్పొరేటర్లు కుంచె జ్యోత్స్న, బెహరా స్వర్ణలత శివదేవి కూడా జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి అంగ దుర్గా ప్రశాంతి పాల్గొన్నారు.