యూనస్కి హసీనా హెచ్చరిక..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, టెంపరరీ దేశాధినేత మహ్మద్ యూనస్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనను విదేశాలతో కలిసి దేశ పతనానికి కుట్ర పన్నిన స్వార్థపరుడైన రుణగ్రహీతగా కామెంట్ చేశారు. విద్యార్థి నిరసనకారుడు అబూ సయీద్ను చంపిన దానిపై కూడా ఆమె సందేహాలను లేవనెత్తారు. 8 నిమిషాల వర్చువల్ ప్రసంగంలో ఆమె యూనస్పై ధ్వజమెత్తారు. తాజాగా తన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడారు. బంగ్లాదేశ్ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం అవామీ లీగ్తో ముడిపడి ఉందని, యూనస్ వీటిని తుడిపెట్టాలని అనుకుంటున్నాడని ఆమె ఆరోపణలు చేశారు. కాగా స్వాతంత్య్ర ఉద్యమకారుల పేరిట నిర్మించిన భవనాలు తగలబెడుతున్నారని, నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని, అది మీకే ప్రమాదమని హెచ్చరించారు.
కాగా బంగ్లాదేశ్ ను నాశనం చేయాలనుకుంటే విదేశీ కుట్రదారులతో యూనస్ కలిశారని ఆరోపించారు. ఈ క్రమంలో దేశాన్ని నాశనం చేయడానికే విదేశీ నిధుల్ని ఉపయోగిస్తున్నారని అన్నారు. తమ పాలన ముగియడం బంగ్లాదేశ్ పరిశ్రమలకు షాక్ ని ఇచ్చిందని, వేలాది కర్మాగారాలు మూతపడ్డాయని, అవామీ లీగ్తో సంబంధం ఉన్న కర్మాగారాలు కాలిపోయాయని, హోటళ్లు, ఆస్పత్రులు ప్రతీదాన్ని నాశనం చేస్తున్నారని హసీనా, యూనస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.