మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు: చిరంజీవి
పవన్ కళ్యాణ్ చిన్నకొడుకు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. పవన్ కళ్యాణ్ ఒకపక్క మన్యం పర్యటనలో ఉండడంతో, ఆయన సింగపూర్ వెళ్లేందుకు ఆలస్యమైంది. ఈలోపు మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లి, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి, ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అని చిరంజీవి పోస్ట్ చేశారు.