బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ పోటీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ పోటీలో లేదని.. తాము బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితే లేదని.. బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది..? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య జరిగిన ఒప్పందం కారణంగానే కాషాయ పార్టీ నామినేషన్ వేసిందని ఆరోపించారు. హైదరాబాద్ స్థానిక సంస్థలకు ఉన్న మొత్తం 112 ఓట్లలో.. బీజేపీకి కేవలం 27 ఓట్లు మాత్రమే ఉన్నాయని, బీఆర్ఎస్కు 23, కాంగ్రెస్కు 13, ఎంఐఎంకు 49 ఉన్నాయన్నారు. తమకు బలం లేకపోవడం వల్లే బరిలో నిలవలేదన్నారు. మరి మెజారిటీ లేని బీజేపీ గెలుపు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల్ని నిలబెట్టలేదని.. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీకి సపోర్ట్ చేయమని.. తాము తటస్థంగా ఉన్నామని.. అలా అని ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదన్నారు. అలాంటప్పుడు గులాబీ పార్టీ బీజేపీకి మద్దతు తెలుపుతుందా అని ప్రశ్నించారు. వీళ్లిద్దరి రాజకీయ అవగాహన మేరకే నామినేషన్ వేశారా..? బీజేపీ గెలుపు కోసం క్రాస్ ఓటింగ్ని ఎంకరేజ్ చేస్తున్నారా..? అని నిలదీశారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఖరిపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజసింగ్ విమర్శల నేపథ్యంలో.. కిషన్రెడ్డి బీఆర్ఎస్ నాయకులకి బినామీగా వ్యవహరిస్తున్నారనే చర్చ ప్రజల్లో జరుగుతోందని తెలిపారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీతో లోపాయికారీ ఒప్పందంతో మద్దతు తెలిపిందని ఆరోపించారు. ఇప్పుడు కూడా బీజేపీకి ఇంటర్నల్గా మద్దతు తెలిపేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు